బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్ షో
ఏరో ఇండియా-2025కు సిలికాన్ సిటీ బెంగళూరు వేదికైంది. ప్రపంచదేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక ఎయిర్ షో… అట్టహాసంగా ప్రారంభం అయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం (ఫిబ్రవరి 10, 2025) యలహంకలోని వైమానిక దళ స్టేషన్లో ఈ షోను ప్రారంభించారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ షో కోసం ఏర్పాట్లన్నీ గ్రాండ్గా చేశారు. మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు ఈ షోలో పాల్గొననున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ షో మొదలైంది. భారతో పాటు ప్రపంచదేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి.రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మక జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక.
జనవరి 10 నుంచి 14వరకు జరగనుందీ ఎయిర్ షో. ‘ది రన్వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’ అనే థీమ్తో జరుగుతుందీ ఎయిర్ షో. ప్రపంచదేశాల యుద్దవిమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది.
అయితే ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన ఎస్యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్-35 లైట్నింగ్ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 14సార్లు ఎయిర్ షోలు జరగ్గా… ఇది 15వ ఎయిర్షో. అలాగే ప్రతీసారి బెంగళూరే ఎయిర్షోకి అతిథ్యమిస్తూ వస్తోంది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది కేంద్రం. ఎయిర్ షో చూసేందుకు పలురాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.