
సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యం
విజయవాడ, న్యూస్ వెలుగు; దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. డీజీపీ ద్వారకాతిరుమల రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని వివరించారు. విఐపి దర్శనాల కోసం వస్తున్న భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతుందని, అటువంటి సందర్భాలలో పోలీసులు సహనంతో బాధ్యత నిర్వహించాలని ఆదేశించారు. మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ సమయోచితంగా వ్యవహరించాలన్నారు.