
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ..! ఉచిత ఇసుకను అక్రమంగా విక్రయిస్తే పీడీ యాక్ట్
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పార్థసారధి, అనిత, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర వివరించారు.
ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీలు రద్దు..
కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీలు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. పూర్తిగా ఉచితంగా ఇసుకను అందజేస్తున్నామని తెలిపారు. ఉచిత ఇసుకతో వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉచిత ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఇసుక కొరత ఉన్న ఐదు జిల్లాలో ప్రత్యామ్నయ్య పాయింట్లు ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు. ఉచిత ఇసుకను ఇతర సరిహద్దు రాష్ట్రాలకు తరలించకుండా చెక్పోస్టులను బలోపేతం చేస్తామని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నింటినీ ఈ పోర్టల్ గెజిట్లో పొందుపరిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
దేవాలయ కమిటీల్లో సభ్యత్వం..
రూ. 20 కోట్ల ఆదాయం వచ్చే దేవాలయాల కమిటీల్లో ఇదివరకు ఉన్న 15 మంది గల సభ్యుల సంఖ్యను 17 కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖ నర్సింగ్ కళాశాలలో ప్రస్తుతమున్న సీట్లను 25 నుంచి 100 సీట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని పార్థసారథి తెలిపారు.
ఇందులో 25 టీచింగ్ పోస్టులకు, 58 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేసిందన్నారు. మంగళగిరిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ మంత్రి వర్గం తెలిపిందని మంత్రి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ తెలిపిందని వెల్లడించారు.
ఉచిత సిలిండర్ల షెడ్యూల్..
ముఖ్యంగా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఈనెల 31 దీపావళి రోజు నుంచి పండుగ వాతావరణంలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. మూడు సిలిండర్ల పంపిణీ షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి జులైలో మొదటి గ్యాస్ సిలిండర్, ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండో గ్యాస్ సిలిండర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్య వదకు మూడో గ్యాస్ సిలిండర్ను పొందవచ్చని పేర్కొన్నారు.
సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డీబీటీ పద్ధతిలో వినియోగదారుడి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని వివరించారు. గ్యాస్ సిలిండర్ సమస్యలను పరిష్కరించేందుకు గాను గ్రామ, వార్డు సచివాలయంలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పథకానికి ప్రతి యేడాది రూ. 2, 684 కోట్లు వ్యయం అవుతుందని, పేద మహిళలకు దీపావళి కానుకగా ప్రకటించింనందుకు మహిళల తరుఫున మంత్రి అనిత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.