
ఈ అవని అందరి బాధ్యత : త్రివిక్రమ్ సుఖవాసి
ఈ అవని అందరిదీ!
అవని ఆరోగ్యమే అందరి ఆరోగ్యం!!
పుడమి పరి రక్షణ అందరి బాధ్యత!
మన కోసం,భవిష్యత్తు తరాల కోసం భూమాతను కాపాడుకుందాం!!
― త్రివిక్రమ్ సుఖవాసి
పుడమితల్లి ప్రకృతి కి – జీవరాశికి మాతృక. సౌందర్యానికి ప్రతీక మానసికోల్లాసానికి నెలవు. ఖేద పడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి, నిర్వేదానికి ఉపశమనం. కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి తల్లిలా పోషిస్తుంది, వైద్యుడిగా రోగాలను నయం చేస్తుంది. ప్రకృతి మనిషిలో జిజ్ఞాసను రేకెత్తిస్తుంది. మిత్రుడిగా మనోభావాలను పంచుకుంటుంది.
“అవని ఆదర్శవంతమైన గురువు”
అవని గురువులా విద్య నేర్పుతుంది.అభ్యసించే నైపుణ్యం ఉంటే గడ్డి పరక నుంచి హిమగిరి వరకూ ఏదో ఒక గుణాన్ని, జీవన విధానాన్ని నేర్చుకోవచ్చు. కృత్రిమత్వం, పక్షపాతం తెలియని సహజత్వం పుడమి పై ప్రకృతి లక్షణం. స్వార్థమే పరమార్ధం అనే భావన పెరిగి ప్రకృతిలోని సర్వ వనరులను ఉపయోగించుకొని తిరిగి ఉపయోగపడని పరాన్న జీవి మనిషి. ప్రకృతిలో భాగమైన మనిషి వికృతంగా తన మనసును కలుషితం చేసు కోవడమే కాక చివరకు పీల్చే గాలిని, తాగే నీటిని, ఆహారాన్ని అందించే అవనిని,పంటలు పండించే నేల తల్లిని, నివసించే వాతావరణన్ని, పైన రోదసిని కలుషిత పరచి ప్రకృతి సమతుల్యతను భగ్నపరచి కొరివితో తల గోక్కుంటున్నాడు. “మనిషి భావోద్వేగ సమతుల్యత దెబ్బతింటే తనకు, సమాజానికి హానికరం. అలాగే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే సర్వ జీవరాశికీ వినాశకరం.” అందుకే ప్రకృతిని తన సహజ స్థితిలోనే ఉండనివ్వాలి. మనిషి ప్రకృతితో కలిసి నడవాలి, పెరగాలి.
విపరీతమైన స్వార్థంతో నా అంతటి వారు లేరు అంటూ అవనికి భంగం కలిగిస్తే ముప్పు తప్పదు!.అందుకే అవనిని అందరం కలిసికట్టుగా కాపాడుకుందాం! నేల తల్లి కోసం కలసి కట్టుగా నడుద్దాం!.మన కోసం,భవిష్యత్తు తరాల కోసం భూమాతను కాపాడుకుందాం!.
త్రివిక్రమ్ సుఖవాసి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం