అక్రమ నిర్మాణాలను గుర్తించడంలో జాప్యం ఎందుకు?

అక్రమ నిర్మాణాలను గుర్తించడంలో జాప్యం ఎందుకు?

కర్నూలు (న్యూస్ వెలుగు): కర్నూలు నగరంలోని ప్రతి సచివాలయ పరిధిలో ప్లానింగ్ కార్యదర్శిలు, అమినిటీస్, వెల్ఫేర్ కార్యదర్శులతో కలిసి అక్రమ నిర్మాణాలను గుర్తించమని పదేపదే చెప్తున్నప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, సిబ్బందితో కలిసి ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను వెల్లడించగా, వాటిపై చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి తక్షణ నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్లానింగ్ కార్యదర్శి, ఇతర కార్యదర్శుల సహాయంతో గుర్తించిన అక్రమ నిర్మాణాలపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పనులు ఆదేశించడం జరిగిందని, ఇందులో నిర్లక్ష్యం వివరిస్తే సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెక్‌లిస్ట్ ప్రకారం పత్రాలు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు వెంటనే నోటీసులు జారీ చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) పథకంపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

 

కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్, డీసీసీ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, సిబ్బంది అనంత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!