ఎర్రచందనం రక్షణ ప్రత్యేక చర్యలు : డిప్యూటీ సీఎం

ఎర్రచందనం రక్షణ ప్రత్యేక చర్యలు : డిప్యూటీ సీఎం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమీక్షలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ అటవీ ఉత్పత్తులను సేకరించే ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిలో భాగంగా రూ.6,573 లక్షల విలువైన ఆదాయం సమకూర్చే వెదురు, టేకు, నీలగిరి, ఇతర కలప, అటవీ ఉత్పత్తులు సేకరించాలని నిర్ణయించడమైందని తెలిపారు.   ఎర్రచందనం రక్షణకై అటవీ శాఖ చేపడుతున్న చర్యల గురించి ఉపముఖ్యమంత్రి సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా వరకు తగ్గిన విషయం గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఎర్రచందనం అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారులకు పునరుద్ఘాటించారు. తిరుపతి ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరాన్ని, ఎర్రచందనం క్యాంపులను నిర్వహించడం, తరచుగా అడవిలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించి అక్రమ రవాణా తగ్గించడంతో పాటుగా భవిష్యత్తులో పూర్తిగా సున్నాకి తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  వీటితో పాటుగా నర్సరీలలో ఉపాధి హామీ పథకం అమలు గురించి చర్చించారు. అలాగే దేశీయ ఉత్పత్తుల నాణ్యత పెంచడంతోపాటు, వచ్చే వానాకాలం సమయానికి ఐదు కోట్ల మొక్కలు నాటే విధంగా ఇప్పటినుండే చర్యలు ప్రారంభించాలని సూచించారు.  గత వందరోజుల పరిపాలనలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్షించడం జరిగింది. దాదాపు 13,282 మీటర్ల పొడవైన కంటౌర్ ట్రెంచెస్, 8 చెక్ డ్యామ్స్, 677 పెర్కొలేషన్ పాండ్స్, 2,440 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అలాగే నాలుగు నగరవనాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు నగరవనాల గురించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అలాగే ఆరు కమ్యూనిటీ ఎకో టూరిజం సెంటర్ల పనులు కొనసాగుతూ ఉన్నాయి.  అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం ప్రకారం అటవీ ప్రాంత పరిధిలోకి వచ్చే 37 బ్లాక్ లను గుర్తించడం జరిగింది.  ప్రకృతి వనరుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూనే, సుస్థిరమైన అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!