
ఏపీలో పింఛన్దారులకు షాక్.. వారి నుంచి రికవరికి ఆదేశాలు
అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్న సదస్సులో రెండో రోజు కీలక అంశాలపై చర్చ జరిగింది.
అయితే వైసీపీ హయాంలో సదరం క్యాంపులు నిర్వహించి మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్లు జారీ చేశారని గుర్తించిన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు 10,958 పింఛన్లలో సుమారు 563 మంది అనర్హులున్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో అనర్హులపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
రానున్న మూడు నెలల్లో పింఛన్ తీసుకున్న అనర్హుల గుర్తించి వారి నుంచి రికవరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.