
కార్తీక వనసమారాధనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు(న్యూస్ వెలుగు): ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం (పుల్లయ్య పార్క్) అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి సమీపంలోని విజయవనం (పుల్లయ్య పార్క్) లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ , జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో వనసమారాధన ఆచరించడం పర్యావరణ పరిరక్షణకు, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని పచ్చదనం పెంపొందించడంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విజయవనం పార్కు ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. పర్యాటకులు ప్రకృతి సౌందర్యం కలిగిన విజయవనాన్ని సందర్శించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఆట,పాటలతో ఉల్లాసంగా గడిపిన అధికారులు
నిత్యం పని ఒత్తిడి తో ఉండే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు కాసేపు వాటిని మర్చిపోయి ఆట,పాటలతో ఉల్లాసంగా గడిపారు, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, వాలీ బాల్, షటిల్, బెలూన్ పిక్ ఆటల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ షటిల్, క్యారమ్, మ్యూజికల్ చైర్స్ ఆటల్లో, జాయింట్ కలెక్టర్ టగ్ ఆఫ్ వార్, షటిల్, క్యారమ్ లో అధికారులతో కలిసి ఆడారు. టగ్ ఆఫ్ వార్ , షటిల్ ఆటల్లో జాయింట్ కలెక్టర్ టీం గెలుపొందింది. తొలుత కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విజయవనం లో మొక్కలు నాటారు. అనంతరం ఉసిరి చెట్టు వద్ద పూజాదికాలు నిర్వహించారు.

షటిల్ గేమ్ లో గెలుపొందిన జాయింట్ కలెక్టర్, మ్యూజికల్ చైర్స్ లో గెలుపొందిన సాంఘిక సంక్షేమ అధికారి రాధిక కి, బెలూన్ పిక్ గేమ్ లో గెలుపొందిన అనురాధ, అగ్నిమాపక శాఖ అధికారికి కలెక్టర్ తులసి బ్యాగ్ లను బహుమతులుగా ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ కన్సర్వేటర్ బి. వి.కృష్ణమూర్తి, డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా అటవీ శాఖ అధికారిని శ్యామల, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, హౌసింగ్ పిడి చిరంజీవి , తదితరులు పాల్గొన్నారు.

