జగన్‌ బాటలోనే చంద్రబాబు వెళ్తున్నారు : వైఎస్‌ షర్మిల

జగన్‌ బాటలోనే చంద్రబాబు వెళ్తున్నారు : వైఎస్‌ షర్మిల

అమరావతి,న్యూస్ వెలుగు: కూటమి ప్రభుత్వం వైద్య, విద్య సంస్థలకు వైఎస్‌ఆర్‌ పేరును తొలగించడాన్ని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తప్పుబట్టారు. వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్‌ పేరు తొలగించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆనాడు పెద్ద తప్పు చేశారని తెలిపారు. ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌(ఎక్స్‌) వేదికగా ఘాటుగా స్పందించారు.
వైఎస్‌ఆర్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉచిత కరెంట్‌, పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శమని షర్మిల కొనియాడారు. వైఎస్‌ఆర్‌ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదని.. తెలుగు వారి ఆస్తి అని తెలిపారు. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలంగానే ఉందని అన్నారు. వైసిపి మీద ఉన్న కోపాన్ని వైఎస్సార్‌ మీద రుద్దడం సరికాదని అన్నారు.

ఏపీలో మెడికల్‌ కాలేజీలకు, కాలేజీ ఆస్పత్రులకు కీర్తిశేషులు ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నామని షర్మిల అన్నారు. ఎన్టీఆర్‌ అయినా, వైఎస్సార్‌ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనని, పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అని చెప్పారు. వాళ్లిద్దరినీ రాజకీయాలకు అతీతంగానే చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదని హితవు పలికారు.

Author

Was this helpful?

Thanks for your feedback!