
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర
అమరావతిన్యూస్ వెలుగు : నేడు ఏపీ కేబినెట్ భేటీ, మంత్రి వర్గం భేటీ కానుంది. పేపర్ లెస్ ఈ కేబినెట్ భేటీని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. 2014-19లో పేపర్ లెస్ ఈ-కేబినెట్ను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. తిరిగి ఇకపై పేపర్ లెస్ ఈ-కేబినెట్ భేటీ నిర్వహించనుంది. అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ఏపీ సర్కార్ అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను వారికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ వివరించారు. ఇక ఇవాళ జరగనున్నా కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేయనుంది.
ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 12 అంశాల ప్రాతిపదికన వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారవుతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కుల సామర్థ్యానికి పనులు పూర్తి చేయడం.. దీని కోసం గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇవ్వనుంది. 1226.68 కోట్ల రూపాయలకు పాత గుత్తేదారులు పనులు కొనసాగింపునకే అనుమతించే అవకాశం ఉంది. వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.డాక్యుమెంట్ రూపకల్పనపై మంత్రుల సలహాలు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కోరే అవకాశం ఉంది.
ఇప్పటికీ విజన్ డాక్యుమెంట్పై ప్రణాళికా శాఖ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్, గ్రామ- వార్డు సచివాలయాల పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై గత కొంతకాలంగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చ జరగనుంది. ఎక్సైజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి బాగోతాలకు కేంద్ర బిందువు.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కూటమి సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేయనుంది. దీంతో సెబ్ను రద్దు చేసి.. తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం గత కొంత కాలంగా కసరత్తు నిర్వహిస్తోంది. కేబినెట్ భేటీలో సెబ్ రద్దు.. ఎక్సైజ్ శాఖ పునర్వ్యస్థీకరణకు కెబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
రేషన్ మాఫియాకు అవకాశం కల్పిస్తున్న ఎండియు వాహనాల రద్దు అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు అమరావతి పర్యటనలు నిర్వహిస్తున్నారు. వారి ముందు ఉంచిన ప్రతిపాదనల పైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కొన్ని శాఖల బదిలీల గైడ్లైన్స్ మార్పులు చేర్పులు పైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగ్గకుండా తీసుకునే క్రమంలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం.. ప్రమాదాల నివారణ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చ జరగనుంది. నరేగా పనుల ఆమోదం కోసం ఇప్పటికే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల పైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.