
న్యూ ఇయర్ వేళ.. మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్
అమరావతి, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. రాష్ట్రంలో మద్యం షాపుల యజమానులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం షాపు యజమానులకు ఇచ్చే కమిషన్ను 10 నుంచి 14 శాతానికి పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో మద్యం విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
మద్యం షాపుల యజమానుల విజ్జప్తిని ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం దృష్టికి ఉన్నతాధికారులు తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో షాపు యజమానులకు 14 శాతం మేర కమిషన్ పెంచుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై మద్యం దుకాణాల యజమాన్యలు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము చాల ఇబ్బందులు పడ్డామని వారు గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన కొన్ని నెలలకే తమ విజ్జప్తిపై సానుకూలంగా స్పందించి.. నిర్ణయం తీసుకోవడం పట్ల మద్యం షాపు యజమానుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.
మద్యం షాపుల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఎక్సైజ్ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. 340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రిటైల్ షాపుల మార్జిన్ 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.99లకు మద్యంతో పాటు, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి-టెక్నాలజీ ద్వారా మద్యం అమ్మకాలు ట్రాక్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.