
పర్యాటక వలయం ఏర్పాటుకు సహకరిస్తాం : సిఎం
పుట్టపర్తి,ఆగస్టు 12 : ఆలయ పర్యాటక వలయం అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబు నాయుడు కు ప్రాథమిక నివేదికను అమరావతిలో ఇటీవల సమర్పించినట్టు పర్యాటక రంగ నిపుణుడు మరియు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు.
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మాధవరాయల గుడిలో సోమవారం నాడు విలేఖరులతో మాట్లాడుతూ…సుమారు 459 కి.మీ. పొడవైన ప్రతిపాదిత వలయంలో జరుగబోవు పర్యాటక అభివృద్ధిని ముఖ్యమంత్రికి వివరించానన్నారు. వలయం ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందంచడంతో, తాను పూర్తిస్థాయి నివేదికను త్వరలో రూపొందించి, ముఖ్యమంత్రికి అందిస్తానని పర్యాటక నిపుణుడు అన్నారు.
జిల్లాలోని హేమావతితో మొదలయ్యే పర్యాటక వలయం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తితో ముగుస్తుంది.ఈ వలయంలో హేమావతి, పెనుకొండ, లేపాక్షి, గోరంట్ల, మేరెడ్డిపల్లి, మల్లెల,కదిరి, సోమపాళ్యం, వాయల్పాడు, శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి, తిరుపతి, గుడిమల్లం మరియు శ్రీకాళహస్తిల లోని ప్రసిద్ధ ఆలయాలు, కోటలు-రాజభవనాలు,చారిత్రక ప్రదేశాలున్నాయని చరిత్రకారుడు తెలిపారు. హేమావతి-శ్రీకాళహస్తి బృహత్ పర్యాటక వలయంలో తీగ రవాణా మార్గాలు(రోప్ వే),సౌండ్ అండ్ లైట్ షో, లేజర్ షో, పురావస్తు ప్రదర్శన శాలలు,పర్యాటక లఘుచిత్రాల ప్రదర్శన కేంద్రాలు,పిల్లల పార్క్ల ఏర్పాటు,వసతి-మౌలిక సదుపాయాల కల్పన, రహదార్లు-రవాణా సౌకర్యాల మెరుగు వంటి అభివృద్ధి కార్యక్రమాలుoటాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి దాదాపు 500 కోట్ల రూ.లు ఖర్చు కాగలదని,నిధులను వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని ముఖ్యమంత్రికి వివరించినట్టు మైనాస్వామి వెల్లడించారు. ఆలయ పర్యాటక వలయం ఏర్పాటుతో ఆయాప్రదేశాలు అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ-ఉపాధి అవకశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం మెగా సర్క్యూట్లను అభివృద్ధి చేస్తే రాష్ట్ర సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబు నాయుడు మరియు పర్యాటక నిపుణుడు మైనాస్వామి ఈ దార్శనికతను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నందున, రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతున్నది.