
రమణీయం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి కుంభోత్సవం
జయ జయ మహా రుద్ర…శ్రీ వీరభద్ర..
ఆకట్టుకున్న వీరగాసే నృత్య ప్రదర్శన.
హాజరైన అశేష భక్త జనం
హోళగుంద, న్యూస్ వెలుగు:జయ జయ మహా రుద్ర…శ్రీ వీరభద్ర…అంటూ భక్తుల జయ జయ ధ్వనులు నడుమ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి కుంభోత్సవంతో వైభవంగా శ్రావణ మాస పూజలు ముగిశాయి.మండల కేంద్రంలో వెలసిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామికి దేవాలయంల్లో నెల రోజుల పాటు జరిగిన శ్రావణ మాస పూజలు ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం ఉదయాన్నే భక్తులు కలిసికట్టుగా స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న పెద్ద బావికి వెళ్లి గంగా మాతకు విశేష పూజలు నిర్వహించి,అక్కడి నుంచి కుంభోత్సవంతో ఊరేగింపుగా వీరగాసే నృత్యాలు చేస్తూ,ఆహా….రుద్ర…వీరభద్ర అంటూ అడుగడుగునా భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి పవాడలను(వడవులు) చెప్తూ,భక్తులకు శాస్త్రాలు గుచ్చుతూ,స్వామివారి నృత్య ప్రదర్శన చేస్తూ,సకల వాయిద్య నడుమ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు.అనంతరం స్వామి సన్నిధిలో వేదపండితులు వినిపించే మంత్రోచ్ఛరణ మధ్య స్వామివారికి జలాభిషేకం,గంధాభిషేకం, పంచామృతాభిషేకం,ఆకుపూజ,మహామంగళ హారతి వంటి విశేష పూజలు చేసి,స్వామివారిని పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగానే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా స్వామివారి కుంభోత్సవం విజృంభణగా నిర్వహించడం జరిగిందని చెప్పారు.అలాగే భక్తులు అనుకున్న మొక్కుబడులు తీర్చుకున్నారు.అదేవిధంగా ఉరవకొండ మహా స్వామి మఠం నందు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భజన కార్యక్రమం నిర్వహించారు.ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.