
శివనాస్మరణతో మార్మోగుతున్న శ్రీశైల క్షేత్రం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మహా శివరాత్రి శోభను సంతరించుకున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీగిరులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువారం క్షేత్ర వీధులన్నీ భక్తులతో సందడిగా కనిపించాయి. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానాలు ఆచరించి.. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనాల కోసం బారులు తీరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.భక్తుల రద్దీ నేపథ్యంలో 11 రోజుల పాటు ఆర్జిత సేవలు నిలిపివేసి, కేవలం అలంకార దర్శనాలు మాత్రం కల్పిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నామని.. అలాగే ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి నిర్దిష్ట సమయాల్లో స్పర్శ దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆలయం తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, పాలు, అల్పాహారం, బిస్కెట్స్, మజ్జిగ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అన్నదాన ప్రసాదాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మరికొందరు భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుంటుండగా.. మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తుండగా.. దేవస్థానం వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.అటవీ ప్రాంతం నుంచి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో వివిధ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. భక్తులను అలరించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు భ్రామరీ నిత్యకళావేదికతోపాటు, ఆలయ పుష్కరిణి, శివదీక్షా శిబిరం వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల నృత్య ప్రదర్శనలు.. భరతనాట్యం, వేణుగానం, కూచుపూడినృత్యం, ఆంధ్రనాటకం, నృత్య హరిచంద్ర నాటకం కనులవిందు చేయగా.. శివరాత్రి వైభవంపై ప్రవచనాలు ఆకట్టుకున్నాయి.