స్వర్ణాంధ్ర అభివృద్దికి ప్రాణాల వేయండి : కలెక్టర్

స్వర్ణాంధ్ర అభివృద్దికి ప్రాణాల వేయండి : కలెక్టర్

నంద్యాల, అక్టోబర్ 04: స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక పత్ర ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్ లతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ పద్మజ, సిపిఓ వేణుగోపాల్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక నిమిత్తం జిల్లాస్థాయి ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రజలు, అన్ని సెక్టార్ల స్టేట్ హోల్డర్స్ భాగస్వాములై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి మండల స్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 60 వేల మందికి పైగా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తమ యొక్క అభిప్రాయాలు పొందుపరిచాన్నారు. మానవ అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యకరమైన జీవన విధానం, ఉన్నతమైన జీవన ప్రమాణాలు కలిగి ఉండడం, ఆనందంగా ఉండడం తదితర ఆరు పారామీటర్లను ఆధారం చేసుకుని ప్రపంచలోని 193 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారని ఇందులో భారతదేశానికి 134 స్థానం ఉందన్నారు. స్వర్ణాంధ్ర@2047 లక్ష్యసాధనతో ప్రపంచంలోనే మూడు అగ్రగామి దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష ఆమె అన్నారు. రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో అపార వనరులు ఉన్నాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 9.68 లక్షల హెక్టార్ల భూమిలో 33% అడువులు ఉన్నప్పటికీ మరికొంత భాగం గ్రీనరీని పెంచుకోవాలన్నారు. 4 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, వాణిజ్య పంటలు పండిస్తున్నారన్నారు. 50 వేల హెక్టార్లలో బిందు, తుంపర్ల సేద్యం ద్వారా పంటలు సాగు చేస్తున్నారన్నారు. 75 వేల హెక్టార్లలో శనగ పంటను మాత్రమే వేసి తొమ్మిది నెలలపాటు ఖాళీగా ఉంచుతున్న భూములను సాగులోనికి తీసుకురావాలన్నారు. అధిక రసాయనిక ఎరువులు వినియోగించి సారవంతం లేని భూములుగా మార్చారని సేంద్రియ ఎరువులను వినియోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో 6 ప్రముఖ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని దీంతో పాటు పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తే జిల్లా జిడిపి పెరుగుతుందన్నారు. పారిశ్రామిక రంగంలో నైపుణ్యాల కొరత ఉందని విద్యార్థి దశ నుండే ఆసక్తిగల రంగాలలో నైపుణ్యతనిచ్చి ఉపాధి మార్గాలను చూపాలన్నారు. ప్రతి ఇల్లు, వీధి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. జిల్లాలో ఎకో టూరిజం ను టెంపుల్ టూరిజంకు అనుసంధానం చేసి ప్రకృతితో కలిసి జీవించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం యాత్రికులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటుచేసి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సహజంగా లభించే వనరులు అయిన సోలార్, విండ్, వాటర్ తదితర సమీకృత వనరులతో వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 70 శాతం అక్షరాస్యత మాత్రమే ఉందని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఉన్న వనరులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేయకుండా డిగ్రీ వరకు చదివించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సుదీర్ఘ ఆలోచనలతో స్వర్ణాంధ్ర@2047 రూపకల్పనకు అన్ని జిల్లాల నుంచి మండల, జిల్లా స్థాయి ప్రణాళికలను స్వీకరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. సంపన్న కుటుంబాలు వ్యక్తులు కొంతమంది నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకొని జీవన ప్రమాణాలు పెంచే దిశలో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ వివరించారు.

ఈ సమీక్షలో దాదాపు 35 మంది వ్యక్తులు తమ విలువైన సూచనలు, సలహాలు వెల్లుబుచ్చారని అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రాబోయే 23 సంవత్సరాలలో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అన్ని సెక్టార్ల స్టేక్ హోల్డర్స్ సమిష్టిగా నంద్యాలను స్వర్ణ జిల్లాగా మార్చేందుకు సహకరించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా 2047 విజన్ కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రపంచంలోని మూడు అగ్రగామి ఆర్థిక దేశాలలో భారతదేశాన్ని ఒకటిగా నిలపాలన్నదే ప్రధానమంత్రి గారి ఆశయం అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కీలకమైన పాత్ర పోషించనుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అంతకుముందు రావినూతల దుర్గాప్రసాద్, డాక్టర్ వసుధ, దస్తగిరి, డా. యశోదర, ఇస్మాయిల్, రాజామహేంద్రనాథ్, నాగరాజు, డాక్టర్ రాజశేఖర్, నోబియా భాను, మహమ్మద్, ఉమామహేశ్వరి, జై పద్మావతి, రాంబాబు, ముత్యాల నాయుడు, రాజశేఖర్ నాయుడు ప్రమీల తదితరులు పాల్గొని తమ అమూల్యమైన సలహాలను జిల్లా స్థాయి కమిటీకి సూచించారు.

 

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS