
బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
“ఐక్యతతోనే బోయ/వాల్మీకుల బలం..
ఎస్టీ రిజర్వేషన్ సాధనకే ప్రధాన లక్ష్యం”
బివిఎస్ తుగ్గలి మండల అధ్యక్షులు వి.వి.నాయుడు
తుగ్గలి, న్యూస్ వెలుగు : బోయ/వాల్మీకుల సామాజిక సమస్యలు, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై తుగ్గలి మండలం పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ వాల్మీకుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరమని బివిఎస్ తుగ్గలి మండల అధ్యక్షులు వి.వి.నాయుడు అన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగినప్పుడే హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు. గ్రామస్థాయిలో బోయ వాల్మీకుల కుటుంబాలను చైతన్యపరిచి, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సంఘటిత శక్తిని బలోపేతం చేయాలని సూచించారు. ఈ నెల 30న తుగ్గలి మండల కేంద్రంలో నిర్వహించనున్న బివిఎస్ మండల స్థాయి బహిరంగ సభకు బోయ వాల్మీకి సోదరులు, సోదరీమణులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వి.వి.నాయుడు విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభ వేదికగా బోయ వాల్మీకులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, రిజర్వేషన్కు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. సామాజికంగా తమకు లభించాల్సిన హక్కులు, అవకాశాలు, రిజర్వేషన్ అంశాలపై సమాజంలోని ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నాయుడు సూచించారు. గ్రామాల వారీగా బోయ వాల్మీకులను సమీకరించి సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతర్గత విభేదాలకు తావివ్వకుండా సామాజిక ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతిలో యువత ముందుండాలని, మహిళలు కూడా క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు. ఆగస్టు 30న జరిగే మండల స్థాయి బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరై బోయ వాల్మీకుల ఐక్యతను చాటాలని అన్నారు.

