
భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవం
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం నూతనంగా నిర్మించిన నేపథ్యంలో మంగళవారం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రా
మస్తులు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పురోహితులు ఏలేశ్వరం. గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు ఏలేశ్వరం. బాల గురునాథ శర్మ( బాలు స్వామి) ఆంజనేయ స్వామికి గ్రామస్తుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యా వాచనం, పురుష సూక్త, లక్ష్మీ సూక్త, మన్య సూక్త, ప్రకారంగా స్నపన కార్యక్రమాలు, పాలు, పెరుగు, నెయ్యి తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లతో పంచామృత అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి స్వామివారికి విశేషంగా నూతన వస్త్రధారణ, పుష్పాలంకరణతో, స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అత్యద్భుతంగా అలంకరించి అష్టోత్తర శతనామాలతో స్వామివారిని కీర్తించి మహా నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం చేయడం జరిగింది. గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొని తమ తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి రామనామ,అంజన్న కీర్తనలు ఆలపించి భజనలు చేసి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయమంతా రామనామ కీర్తనలతో మార్మోగింది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహించారు. పై కార్యక్రమాలను తిలకించుటకు మండలానికి చెందిన ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది.