ప్రతి మనిషికి విద్య ఒక బ్రహ్మాస్త్రం

ప్రతి మనిషికి విద్య ఒక బ్రహ్మాస్త్రం

న్యూస్ వెలుగు గుంటూరు  నాగార్జున వర్సిటీ : ప్రతి మనిషికి విద్య ఒక బ్రహ్మాస్త్రం అనీ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ మెడి కల్ &ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎమ్ టి.కృష్ణబాబు పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడితేనే జీవితంలో విజయం వరిస్తుందని ఆయన విద్యార్థులకు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తక్షశిల విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏం గోపాలకృష్ణ విరచిత “లైఫ్ ఆఫ్ కర్మయోగి” పుస్తక సమీక్ష చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలని విద్యార్థులు వారి సమయాన్ని సోషల్ మీడియాలో దుర్వినియోగం చేసుకోకుండా తమ భవిష్య ప్రణాళికలపై దృష్టి సారించాలని ఆయన హితోపదేశం చేశారు. ఎ ఎన్ యు తక్షశిల విద్యాకేంద్రం పాఠ్యప్రణాళిక పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి లక్ష్యసాధనకై క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు. ఆరు దశాబ్దాల విలువలతో కూడిన నైతిక ప్రయాణ సివిల్ సర్వెంట్ ఎమ్ గోపాలకృష్ణ జ్ఞాపకాలే లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నేటితరం విద్యార్థులకు మార్గదర్శకమని ఆయన వివరించారు. భారతదేశ స్వాతంత్ర్యం ముందు, తరువాత మూడు తరాల సమగ్ర జీవిత దృశ్యము కర్మయోగి అని టి కృష్ణబాబు విపులీకరించారు.
పుస్తక రచయిత విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎమ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా తన సర్వీసులో ఎదురైన అనుభవాలు, అనేక రాష్ట్రాలలో జ్ఞాపకాలను విద్యార్థినీ విద్యార్థులతో పంచుకున్నారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలు, విలువలతో కూడిన విద్యాభ్యాసం, కష్టపడే తత్వం , క్రమశిక్షణ, విద్య పట్ల విద్యా వ్యవస్థ పట్ల సముచిత భావం, గురువులపై గౌరవం వంటి లక్షణాలు ప్రతీ విద్యార్థి అలవర్చుకోవాలని ఆయన సూచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి వి ఎన్ విష్ణు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఎ ఎన్ యు రెక్టార్ ఆచార్య కే రత్నషీలామణి, ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎమ్ సురేష్ కుమార్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బి ఎస్ ఎన్ దుర్గాప్రసాద్, విశ్రాంత ఐజి రవిచంద్ర గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఏలూరి ఫౌండేషన్ చైర్మన్ ఏలూరి ప్రసాదరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!