
7 స్టార్స్ ఆర్కెస్ట్రా, రికార్డింగ్ స్టూడియో అధినేత ఫయూం మృతి
కర్నూలు, న్యూస్ వెలుగు; ముప్పై ఏళ్ళ కిందట కర్నూలు నగరంలో మొట్టమొదటి సారిగా రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసి, హైదరాబాద్, చెన్నయ్ లకు రికార్డింగ్ కోసం వెళ్ళే వారికి వ్యయ్య, ప్రయాసలను తగ్గించిన ప్రముఖ జాజ్ డ్రమ్మర్ షేక్ ఖాజా ఫయూం(57) ఆదివారం రాత్రి మృతి చెందారు. తీవ్రమైన గుండె పోటు రావడంతో చికిత్స అందేలోపే ఆయన మృతి చెందారు. ఫయూం కు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారం క్రితమే కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు. ముప్పై ఏళ్ల కిందట కర్నూలు నగరంలో సినిమా ఆర్కెస్ట్రా లలో జాజ్ డ్రమ్మర్ ఆరంగేట్రం చేసి, 7 స్టార్స్ ఆర్కెస్ట్రా ను స్థాపించారు. అటు తర్వాత రికార్డింగ్ స్టూడియో ను ఏర్పాటు చేసి, ఎంతోమంది కళాకారులకు ఉత్తమ, నాణ్యమైన సంగీతాన్ని, రికార్డింగ్ ను అందించారు. 2016 లో కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఆద్వర్యంలో నేత్ర దానం పై ” చెయ్ చెయ్ చెయ్… నీ కళ్ళను దానం చెయ్” అనే పాటను రికార్డ్ చేసి, కొరియోగ్రఫీ చేసి అందరినీ మెప్పించారు. ఆ పాట అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఇటీవలే అనగా 2025 జనవరి రెండో వారంలో కోడుమూరు సీఐ తబ్రేజ్ ఆద్వర్యంలో రూపొందించిన “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అనే వీడియో సాంగ్ ను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విడుదల చేసారు. అంతే కాకుండా జానపద, ఖవాలీ, హిందూ, క్రైస్తవ భక్తి గీతాలను ఎన్నో రికార్డ్ చేసారు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆయన చేసారు. కర్నూలు జిల్లా వాసులే కాకుండా కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి కూడా రికార్డింగ్ కోసం వచ్చేవారు. ఫయుం మరణ వార్త విని కర్నూలు నగర కళాకారులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. బెంగుళూరు నుండి వచ్చిన సినీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ భోరున విలపించారు. భార్యా పిల్లలు, బంధువులు, తోటి కళాకారులు, ఆప్తులు, శ్రేయోభిలషుల మధ్య ఫయూం అంత్యక్రియలు సోమవారం ముగిశాయి.