
రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్న్యూస్.. వంట నూనెల ధరలను భారీగా తగ్గించిన ఏపీ సర్కార్
అమరావతి; పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో కిలో పామాయిల్ రూ.110, సన్ఫ్లవర్ నూనె రూ.124కే అందించాలని నిర్ణయించింది. ఈ ధరలు నేటి నుంచి ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామాయిల్, ఒక లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున మాత్రమే ఇవ్వనున్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధరల నియంత్రణపై చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రమంతటా ఒకే ధరపై విక్రయించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. దీనికి డీలర్లు, సప్లయర్స్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతి రేషన్ కార్డుపై సన్ఫ్లవర్ ఆయిల్ను గరిష్ఠంగా 124, పామాయిల్ను రూ.110కి విక్రయించేందుకు అంగీకరించారు.