
కంది రైతుల కష్టాలు తీరేదేన్నాడో…!
* ప్రభుత్వ మద్దతు ధరపై ఆసక్తి చూపని కంది రైతులు.
* బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా ప్రభుత్వం కొనుగోలు.
* హమాలీల భారం రైతులపైనే వేస్తున్న మార్క్ఫెడ్ అధికారులు.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.దేశానికి రైతే వెన్నెముక అనే సామెత…..సామెతగానే మిగిలిపోతుంది.రైతుల గురించి ఆలోచించేవారు కానీ,రైతుల సమస్యలను పరిష్కరించే వారు ఎవరూ లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ప్రభుత్వ విధానాల ద్వారా, దళారీ వ్యవస్థల ద్వారా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు. రైతులకు పొలం పెట్టుబడులు అధికమవడం,దిగుబడి తగ్గిపోవడం పండిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ అధికారులు 7550 రూపాయల మద్దతు ధరతో రైతుల నుండి కందులను కొనుగోలు చేస్తున్నారు.ప్రస్తుతం బహిరంగ మార్కెట్ కందుల ధరలతో పోలిస్తే ప్రభుత్వ మద్దతు ధర చాలా తక్కువ కావడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు.గత కొద్ది రోజుల క్రితం 10,000 వేలకు పైగా పలికిన ధర నేడు అమాంతంగా పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు.ఎంతోమంది రైతులు,రైతు సంఘం నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు కందుల మద్దతు ధరను 10,000 లుగా ప్రకటించాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం కందుల కొనుగోలులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిబంధనల ద్వారా చాలామంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు పలువురు రైతులు తెలియజేస్తున్నారు. రైతులు పండించిన పంటను ధైర్యంగా అధిక ధరలకు అమ్ముకోలేక రైతాంగం చతికిలపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం మార్క్ఫెడ్ అధికారులు కందుల కొనుగోలులో హమాలీ చార్జీలను రైతులపైనే భారం మోపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుచున్నారు.