
జ్ఞాన సముపార్జనతో జీవన్ముక్తి
ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్
కర్నూలు, న్యూస్ వెలుగు; జ్ఞాన సముపార్జనతో జీవన్ముక్తి లభిస్తుందని, అదే నిజమైన ఆనందమని ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ స్వామి భక్తులకు ఉపదేశించారు. ధనుర్మాసం సందర్భంగా కర్నూలు నగర శివారులోని గోదాగోకులం నందు జరుగుతున్న ధార్మిక కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. గోదా అంటే సకల సంపదలను ప్రసాదించే తల్లి అని, నియమనిష్టలతో భగవంతుడిని సేవించుకుంటే సకల సంపదలు మన వశమవుతాయని గోదాదేవి తన భక్తి మార్గం ద్వారా మనకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ద్రవిడ వేదంగా విరాజిల్లుతున్న తిరుప్పావై పాశురాలు పారాయణం అనంత పుణ్యఫలమని, మధుర భక్తికి నిదర్శనమని అన్నారు. అఖండ విష్ణు సహస్రనామ పారాయణ సప్తాహంలో భాగంగా ఐదవ రోజు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, చైర్మన్ పల్లెర్ల నాగరాజు, గోదాగోకులం సభ్యులు మహేశ్వర రెడ్డి, తల్లం సురేశ్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, టి.శ్రీనాధ్, చిత్రాల వీరయ్య, వేముల జనార్దన్, భీమిశెట్టి ప్రకాశ్, లింగం కృష్ణయ్య, బాల సుధాకర్, వేదపండితులు రమేశ్ బట్టర్, కిరణ్ బట్టర్, మహిళా మండలి సభ్యులు ధర్మరాజు శైలజమ్మ, పాలాది విజయ, చంద్రకళ, తలుపుల సరితతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.