
26న గుండ్ల బ్రహ్మేశ్వరం లో మహాశివరాత్రి ఉత్సవాలు
భక్తులకు అటవీ అధికారులు, ఆలయ కమిటీ విజ్ఞప్తి
బండి ఆత్మకూరు,న్యూస్ వెలుగు : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నల్లమల్ల అభయారణ్యంలోని శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రంలో ఈనెల 26న మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇందులో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల జయరామిరెడ్డి, వైస్ చైర్మన్ కొరకంచి శంకర్, సెక్రటరీ తేళ్ల పూరి నారాయణ , వైస్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు ట్రెజరర్ రాముడులు ఆదివారం శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి మహా శివరాత్రి ఆహ్వాన పత్రిక పంపిణీ చేశారు.
ప్రకృతి రమణీయతల మధ్య షో బిల్లుతో నల్లమల్ల అడవిలో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగిందని తెలిపారు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ద్వాపరయుగ చిరంజీవి గురు పుత్రుడు అశ్వద్ధామ ప్రతిష్టించిన శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ ఆంజనేయస్వామి, నవగ్రహముల గల ఆలయములో ఇక్కడ ప్రసిద్ధి. శ్రీ బ్రహ్మేశ్వరుని కోవెలతో పాటు రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారం ద్రౌపది అంగీకారంతో గుండ్లకమ్మ నది జన్మస్థల తీరాన నల్లమల్ల మహాగోరారన్యంబున తపస్సు చేసి ప్రతిష్టింపబడిన శివలింగం, చాళుక్య రాజుల కాలంలో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందిందని ఇక్కడ శిలా శాసనాల వల్ల తెలుస్తోందని కమిటీ సభ్యులు తెలిపారు. కాగా 26, 27న జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.
గుండ్ల బ్రహ్మేశ్వరం వెళ్లే భక్తులకు ఉచిత వాహన సౌకర్యం
మహాశివరాత్రి ఉత్సవాలకు గుండ్ల బ్రహ్మేశ్వరం కాళీ నడకన వెళ్లే భక్తుల కోసం చిన్నదేవలాపురం, నారాయణపురం గ్రామాల ప్రజల సహకారంతో ఉచిత వాహన సౌకర్యం కల్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. క్షేత్రానికి నడిచి వెళ్లే భక్తుల కొరకు 26 వ తేదీన ఉదయం నుంచి నారాయణపురం నుండి నల్లమల్ల అభయారణ్యంలోని కొండమొత్త వరకు ట్రాక్టర్ సదుపాయం ఏర్పాటు చేయడమైనదని వారు తెలిపారు. అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో కొండముత్తు నుండి నారాయణపురం వరకు మళ్లీ ఉచిత వాహన సౌకర్యంతో పాటు భోజన సదుపాయం కల్పించినట్లు వారు తెలిపారు.
అడవిలో నిప్పు పెట్టరాదు – అటవీ అధికారులు
శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం నల్లమల్ల అభయారణ్యం కావడంతో అక్కడికి వెళ్లే భక్తులు అటవీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అటవీ అధికారులు బండి ఆత్మకూరు రేంజర్ నాసిర్ ఝా, గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజర్ ఉదయ్ లు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భక్తులు అడవికి నిప్పు పెట్టడం, వణ్యప్రాణులకు హాని కలిగించడం, బాణాసంచ పేల్చడం, పెద్దగా సౌండ్ చేస్తూ వెళ్లడం వంటి పనులు చేయరాదన్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ను అడవిలోకి తీసుకు వెళ్ళరాదన్నారు. అలాగే పేలుడు పదార్థాలు అడవిలోకి తీసుకువెళ్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. వీరితోపాటు ఆలయ కమిటీ సభ్యులు అటవీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ అధికారుల ప్రత్యేక అనుమతితో ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. అయితే మహాశివరాత్రి ఉత్సవాలతో పాటు అటవీ సంరక్షణ మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ అటవీ నిబంధనలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని వారు కోరారు.