
ఆయిల్ పామ్ సాగుతో రైతుకి లక్షల్లో ఆదాయం
నంద్యాల న్యూస్ వెలుగు ఏప్రిల్ 7 : నంద్యాల జిల్లా ఉద్యాన శాఖ మరియు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామంలో మంగళ వారం ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఆయిల్ పామ్ పంట సాగులో ప్రభుత్వం అందించే సబ్సిడీ ప్రయోజనాల గురించి ఉద్యాన శాఖ అధికారిణి కే.చందన వివరించారు. పతంజలి ఫుడ్స్ జిల్లా మేనేజర్ ఎస్. రమణా రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు చేసే రైతుకు -1 ఎకరాకు 50 మొక్కల చొప్పున సంవత్సరం వయస్సుగల మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక హెక్టారుకు 10,500/- రూపాయల చొప్పున ఆయిల్ పామ్ పంటకు అయ్యే ఎరువుల ఖర్చుకు, అంతరపంట సాగు కొరకు ప్రోత్సాహకంగా అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఆయిల్ పామ్ మొక్కలను సాగు చేసుకుంటే 4వ సంవత్సరం నుండి దిగుబడినిస్తూ 25 సంవత్సరాల పాటు దిగుబడిని ఇస్తుందని, సంవత్సరానికి రూ.1,00000/- నుండి రూ. 1,50,000/- లు వరకు ఏకరానికి ఆదాయం పొందవచ్చని అన్నారు. ఈ పంటను సాగు చేసుకునేందుకు ప్రధానంగా నీటి వసతి కలిగి ఉండాలని, ఆసక్తిగల రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలలో సంప్రదిస్తే పతంజలి కంపేని సిబ్బంది మరియు ఉద్యాన శాఖ ద్వారా రైతులకు మొక్కలను అందించగలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఫుడ్స్ జిల్లా మేనేజర్ ఎస్. రమణా రెడ్డి , రైతు సేవ కేంద్ర సిబ్బంది మరియు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


