నాణ్యతలేని స్వీట్లు.. వినియోగదారులకు అంటగడుతున్నారు

నాణ్యతలేని స్వీట్లు.. వినియోగదారులకు అంటగడుతున్నారు

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడి
 హైదరాబాద్ : దీపావళి అంటే స్వీట్లకు ఎక్కడ లేని డిమాండ్‌.. మంచి తరుణం మించిన దొరకదని భావించే మిఠాయి దుకాణాదారులు దీపావళి డిమాండ్‌ను ఆసరా చేసుకొని స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలతో స్వీట్లు తయారీ చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు అతిక్రమించిన పలు స్వీట్స్‌ యజమానులపై ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు. అమీర్‌పేటలో పలు షాపులపై దాడులు నిర్వహించగా, ఎక్కువ శాతం ఫుడ్‌ లైసెన్స్‌లు లేకుండా, గడువు ముగిసిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు, వంటగదిలో అపరిశుభ్రత ఉందని తేల్చారు.

అమీర్‌పేటలోని ఢిల్లీ మిఠాయివాలాలో తనిఖీలు చేపట్టగా.. పెరుగు, పాలు వంటి కొన్ని ఆహార పదార్థాలు లేబుళ్లు వేయలేదని, అపరిశుభ్రమైన వాతావరణంలో చక్కెర సంచులు నిల్వ చేసినట్లు , స్టోర్‌ రూంలో ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. వంటగదిలో డస్ట్‌బిన్లకు మూతలు లేవు. అమీర్‌పేటలోని ఆగ్రా స్వీట్స్‌ నిర్వాహకులు లైసెన్స్‌ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పనిచేసే సిబ్బందికి హెడ్‌ క్యాపులు, గ్లౌవ్స్‌ లేవని, ఫ్రిజ్‌లో ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు లేవని, మరికొన్ని గడువు ముగిసినట్లు గుర్తించారు. వినూత్న ఫుడ్స్‌, వాసిరెడ్డి హోంఫుడ్స్‌లోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. రాష్ట్ర లైసెన్స్‌ బదులు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌తో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సావరీస్‌ వంటి ఆహార పదార్థాలకు లేబుల్స్‌ లేవని, సిబ్బంది ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తేల్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!