
వైసీపీ హయాంలోని రహస్య జీవోలు బయటపెట్టండి
అమరావతి ; ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారును ఆదేశించింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీవోఐఆర్ వెబ్సైట్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు, జీవో కాపీలను అందులో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులను మాత్రం సైట్లో అప్లోడ్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా జగన్ సర్కార్ జీవోలను రహస్యంగా ఉంచుతుందని అప్పటి ప్రతిపక్షాలపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ రహస్య జీవోలను బయటపెట్టాలని నిర్ణయించింది.
పారదర్శకత, సమాచారం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో ఉండాల్సిందేనని జీఏడీ కార్యదర్శి సురేశ్కుమార్ తెలిపారు. అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టత ఇస్తాయని అన్నారు. అయితే మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతుందని తెలిపారు. అందుకే మూడేళ్ల కాలానికి సంబంధించిన జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు.