
శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ వెలుగు; విజయనగర సామ్రాజ్యాధినేత, పరిపాలన దక్షుడు శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. శ్రీకృష్ణదేవరాయల 555 జయంతి సందర్భంగా స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ కూడలిలో ఉన్న విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయల్ అఫీషియల్స్ ప్రొఫెషనల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం స్వర్ణ యుగమని, ఆయన పాలనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవైపు ప్రజలకు అవసరమైన సాగు,త్రాగునీటి కోసం ఎన్నో చెరువులు తవ్వించిన ఘనత ఆయనకే ఉందన్నారు. అవి నేటికీ వాడుకలో ఉంటూ ఇప్పటి ప్రజల అవసరాలు తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అలాగే దేశభాషలందు తెలుగు భాష లెస్స అని తెలుగు జాతి కీర్తిని చాటి చెప్పిన ఘనత కృష్ణదేవరాయలకే దక్కుతుందని టీజీ వెంకటేష్ అన్నారు. రాజ్య ప్రజల సంక్షేమంతో పాటు కళలకు, కళాకారులకు, కవులకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు మాత్రమేనని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తి గురించి భావితరాలకు తెలియచేయవలసిన అవసరం ఎంతో ఉందని, అందులో భాగంగా ఆయన సేవలు వివరిస్తూ జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే చేయాలని టీజీ కోరారు. అలాగే కాపు, బలిజ కులస్తులు తమకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఎప్పటినుంచో పోరాడుతున్నారని దేశంలో రిజర్వేషన్ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయని టీజీ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కావడంవల్ల కాపు, బలిజ కులస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది అన్నారు. దీనివల్ల ఈ కులాలు ప్రజలు అభివృద్ధి చిందేందుకు ఎంతో దోహదం చేస్తుందని టీజీ అన్నారు. నగరంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని అధికమించి ఏర్పాటు చేసుకోగలిగామని, భవిష్యత్తులో ఈ విగ్రహానికి మండపం ఏర్పాటుకు తన వంతుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయల్ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ వై సత్యనారాయణ, ఆర్జా రామకృష్ణ, కోనేటి చంద్రబాబు, చింతలపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, మాజీ డిఎస్పిలు రామనాథ్, వెంకటేశ్వరరావు, కొట్టే చెన్నయ్య, విజయలక్ష్మి, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.