
మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు: మాదకద్రవ్యాల నియంత్రణకు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మాదకద్రవ్యాల నియంత్రణ కు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీ ల యాజమాన్యాలు విద్యార్థులకు మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలు,ప్రమాదాల గురించి విపులంగా వివరించి, వాటికి సంబంధించిన వీడియోలు ప్రదర్శించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిఇఓ, ఆర్ఐఓ , మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు… వారి దృష్టికి వచ్చిన విషయాలను ఎస్పీకి తెలియజేయాలన్నారు.. ఈ సందర్భంగా క్లస్టర్ యూనివర్సిటీ అధికారి మాట్లాడుతూ దాదాపు 2500 మంది విద్యార్థులకు ఆగస్టు 15న మాదక ద్రవ్యాల వినియోగం చేయకుండా ఉండే విధంగా ప్రతిజ్ఞ చేయించామని, ఈ మధ్య జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ చే కూడా మాదకద్రవ్యాల వినియోగం జరగకుండా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు..
జిల్లాలో మిరప తదితర పంటల మధ్యలో గంజాయి సాగుకు అవకాశం ఉంటుందని, వ్యవసాయ శాఖ అధికారులు పర్యటనలకు వెళ్ళినప్పుడు తనిఖీ చేయాలని, గంజాయి సాగు గుర్తించినట్లయితే వెంటనే విషయాన్ని జిల్లా ఎస్పీకి తెలియజేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా కొండ ప్రాంతాలలో, అడవుల్లో మాదకద్రవ్యాల సాగు మరియు నాటు సారా తయారీ చేసే అవకాశం ఉన్నందున ఎక్సైజ్ శాఖ వారి సహాయంతో వాటిని రూపుమాపాలని డిఎఫ్ఓ ను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చే సారాను ఆపే విధంగా నిరంతరం చర్యలు తీసుకుని,అక్రమ రవాణా అరికట్టాలని ఆదేశించారు. తండాలపై పటిష్టమైన నిఘా ఉంచాలని, బెల్ట్ షాపులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ , ఆర్ టీ సి అధికారులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తూ అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నివారించడానికి యాంటీ నార్కోటిక్స్ ఫార్మేషన్ బిల్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం జరిగిందని, ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1972 కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు.. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత టోల్ ఫ్రీ నెంబరు కు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు గంజాయి మొక్కలను అంతర పంటలుగా వెయ్యకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిన్నటి రోజున కౌతళం మండలం, రౌడూరు గ్రామంలో 182 గంజాయి మొక్కలను అంతర పంటగా వేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. రైల్వే, ఆర్టీసీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు..ఇప్పటి వరకు 30 ప్రభుత్వ, 44 ప్రైవేటు కళాశాలలో అవగాహన కల్పించడంతో పాటు హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులపై కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా స్టిక్కర్స్ వేసేందుకు అనుమతి ఇస్తే, తగిన చర్యలు తీసుకుంటామన్నారు…. శైవ క్షేత్రాలకు దూర ప్రాంతాల నుండి సాధువులు వస్తుంటారని, వారి నుండి స్థానికుకు గంజాయి మొక్కల విత్తనాలు తీసుకొని పెంచుకునే అవకాశం ఉంటుందని, అలాంటి వారిపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు.. పాఠశాలల్లో కూడా ప్రార్థన అయిన తరువాత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పిల్లలతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరిగినప్పుడు ఎన్డిపిఎస్ చట్టంపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఇరిగేషన్, రవాణా, కార్మిక, వ్యవసాయ, అధికారులు కూడా మాదక ద్రవ్యాల నివారణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేయాలని ఎస్పీ కోరారు .
అంతకుముందు జిల్లా ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో మత్తు పదార్థాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, డిటిసి శాంతకుమారి, కార్మిక శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల, ఆర్ఐఓ గురువయ్య శెట్టి, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్, సాంఘిక సంక్షేమ శాఖ జేడి రంగలక్ష్మి దేవి, ఔషద నియంత్రణ ఎడి రమాదేవి, మైనారిటీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, ఎక్సైజ్ సూపరంటెండెంట్ సుధీర్ కుమార్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి, క్లస్టర్ యూనివర్సిటీ, జిజిహెచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.