
చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం కోర్టు
ఢిల్లీ : తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుపట్టింది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ నిలదీసింది . కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై రెండో ఒపీనియన్ తీసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యవహారంలో మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది.
అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం, మరో ఇద్దరు న్యాయవాదులు చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని, కల్తీ వ్యవహారంపై నిజనిజాలు తేల్చాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా(Siddartha Luthra) వాదనలు వినిపించారు. లడ్డూలో కల్తీ జరిగిందని అనుమానం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ఏపీ న్యాయవాదిని ప్రశ్నించింది.
నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత , తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది.