
గ్రామ స్వరాజ్యాన్నికూల్చిన కూటమి ప్రభుత్వం: మాజీ మంత్రి
తాడేపల్లి న్యూస్ వెలుగు : విజయదశమి పండుగ, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ చిత్రపటం వద్ద పూజలు నిర్వహించిన పార్టీ నాయకులు అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేకుని కొనియాడారు. స్వాతంత్ర్యానికి పూర్వం కన్నా దారుణమైన పరిస్థితులు కూటమి పాలనలో రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సాకారం చేయడానికి మాజీ సీఎం వైయస్ జగన్ పునాదులు వేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే కుల్చిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితోనే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా వైయస్సార్సీపీ పాలనలో లబ్దిదారులందరికీ వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందేలా చూశారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.