
జాతీయ రహదారి విస్తరణకు సహకరించాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; దామోదరం సంజీవయ్య (చెక్పోస్ట్) నుండి నందికొట్కూరు రోడ్డు వైపు సాయి గార్డెన్స్ వరకు జాతీయ రహదారి విస్తరణకు ప్రజలు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు కోరారు. శనివారం చెక్పోస్ట్ సమీపంలోని సంతోష్ ఫంక్షన్ నందు రహదారి విస్తరణలో భూమి కోల్పోనున్న బాధితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగుల రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయని, ఏవైనా అభ్యంతరాలు, మార్పుచేర్పులు, అభిప్రాయాలు ఉంటే తెలపాలని అధికారులు బాధితులను కోరారు. బాధితుల అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. భూమి కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ రహదారుల ఈఈ శంకర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.