
సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం అన్నింటా ఘోర వైఫల్యం
అందుకే చంద్రబాబు అదేపనిగా డైవర్షన్ పాలిటిక్స్
:మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి
తాడేపల్లి, న్యూస్ వెలుగు; మెడికల్ కాలేజీలకు సంబంధించిన జీవోను జగన్గారి చెవికి కట్టి ఊరేగిస్తామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబుకే.. ఆ సూపర్సిక్స్ పోస్టర్ అతికించి, సెక్యూరిటీ అనుమతిస్తే గాడిద మీద ఊరేగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
అమరావతి గురించి మాట్లాడితే నోటికి తాళం వేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపైనా కాకాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి సంయమనం కోల్పోవడం సరికాదన్న ఆయన.. వర్షాల్లో రాజధాని అమరావతి ప్రాంతం నీట మునుగుతోంది వాస్తవం కాదా? అంటూ, దానికి సంబంధించిన చిత్రాలు మీడియాకు చూపారు. అయినా తన అనుకూల మీడియాలో అమరావతి మునగలేదని రాయించిన చంద్రబాబు.. అమరావతిలో వరదనీటి దృశ్యాలు సోషల్ మీడియాలో రాగానే మాట మార్చారని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియడంతో తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, గతి తప్పి మాట్లాడుతున్నారని, అందుకే నోటికి తాళం వేస్తామంటూ వ్యాఖ్యానించారని తెలిపారు.
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో, సుదీర్ఘకాలం సీఎం పదవిలో ఉన్న చంద్రబాబుకు, చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే, ఒక్క బ్రాండింగ్ లేదని మాజీ మంత్రి కాకాణి గుర్తు చేశారు. అందుకే ఏం చెప్పాలో తెలియక, రోజువారీ కార్యక్రమాలను కూడా ప్రస్తావిస్తూ, అవి తమ ఘనతగా చెప్పుకుంటూ.. ఇప్పుడు 100 రోజుల పాలనపై 100 అంశాలతో నిస్సిగ్గుగా అసత్యాల ప్రకటన చేశారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వైయస్సార్సీపీపై కక్ష సాధింపు, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం తప్ప ప్రజా సంక్షేమ పాలన లేదని కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. శాడిస్ట్ పాలన చేస్తున్న చంద్రబాబు వైఖరి.. ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల నాటి నుంచే యథేచ్ఛగా ఇసుక దోపిడి మొదలైందని, 40 లక్షల టన్నులకు పైగా ఇసుక దోపిడి చేశారని చెప్పారు.
బుడమేరు, ఏలేరు వరద విపత్తులకు ప్రభుత్వమే కారణమన్న మాజీ మంత్రి, అక్కడా ఇక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ లేదని, ప్రజలను అలర్ట్ చేయలేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని.. వరదలు ముంచెత్తిన తర్వాత కూడా సహాయక చర్యల్లో దారుణంగా విఫలమయ్యారని తెలిపారు. ఒక్క విజయవాడలోనే దాదాపు 3.50 లక్షల మంది వరద బాధితులుంటే.. ఆ ప్రాంతాల్లో ఆర్భాటంగా మందీ మార్బలంతో రోజుకో వాహనంలో పర్యటనలు, ఫోటో షోలు.. గంటలకొద్దీ అధికారులతో సమీక్షలు.. రోజూ రెండుసార్లు ప్రెస్మీట్లు.. ఇదే చంద్రబాబు దినచర్యగా మారిందని చెప్పారు.
భారీ వరదకు కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమ కట్టడ ఇల్లు నీట మునిగి పోవడంతో, గత్యంతరం లేక కలెక్టరేట్ వద్ద బస్సులో పడుకుని.. వరదలు తగ్గేంత వరకు తాను అక్కడే ఉంటానని కలరింగ్ ఇచ్చిన నీచమైన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు.
విజయవాడ వరదల్లో బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, బోట్లతో వైయస్సార్సీపీ నాయకులు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాలని కుట్ర చేశారని దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి ఆక్షేపించారు. అంత పచ్చిగా అసత్యాలు పలికిన చంద్రబాబుది నోరా.. లేక తాటిమట్టా? అని వ్యాఖ్యానించారు.
ఈ 100 రోజుల పాలనలో విధ్వంసం, అరాచకం తప్ప చంద్రబాబు సాధించిన ఘనకార్యాలేవీ లేవని కాకాణి స్పష్టం చేసారు. అబద్దాలకు అలవాటు పడ్డ చంద్రబాబుకు.. ప్రజలు ఛీకొడతారన్న కనీస స్పృహ కూడా లేదని.. అందుకే నిస్సిగ్గుగా బుక్లెట్ ముద్రించారని అన్నారు.
మెగా డీఎస్సీ అంటూ 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై తొలి సంతకం పెట్టి.. ఇప్పటివరకు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కనీసం షెడ్యూల్డ్ కూడా విడుదల చేయకుండా.. మొత్తం ప్రక్రియను అటకెక్కించిన ఘనత చంద్రబాబుదని ఆగ్రహించారు. అలాగే అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశానని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు కేంద్రంతో సంప్రదింపుల ఫలితంగా పోలవరం కోసం రూ.12,500 కోట్లు నిధులు విడుదలైతే అది కూడా తామే రాబట్టామని చెప్పడానికి చంద్రబాబు ఏ మాత్రం సిగ్గు పడడం లేదని కాకాణి మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు రుణంగా ఇప్పిస్తామని కేంద్రం ప్రకటిస్తే, అది కూడా తన ఘనత అని చెప్పడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.
ప్రజాదర్భార్ లో 50వేల అర్జీలు వచ్చిన విషయాన్ని వంద రోజుల ఘనతగా చెప్పుకుంటున్న లోకేష్.. వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయో చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో చేసిన దోపిడికి కొనసాగింపుగా నీరు–చెట్టుకు సంబంధించిన రూ.256 కోట్లు విడుదల చేసి దాన్ని ఒక ఘనకార్యంగా చెప్పుకోవడంపైనా అభ్యంతం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదన్న ఆయన, అవి తాము చెల్లించామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు.
ఎంఏ ఎకనామిక్స్ చదివిన ఆర్ధిక తత్వవేత్తనని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఎందుకు పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారని కాకాణి నిలదీశారు. వరదలు వచ్చి 18 రోజులైనా ఇంకా నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారన్న ఆయన, చంద్రబాబు వంద రోజుల పాలన.. బొంద పాలన అని స్పష్టం చేశారు.
వంద రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్ని వ్యవస్ధలను నాశనం చేసి శత దిన విధ్వంసానికి పాల్పడిందన్నారు. బాబు వచ్చి రాష్ట్రాన్ని ముంచాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అధికారులపై వేధింపులు, తనకు నచ్చని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లేకుండా చేయడం ఇవే చంద్రబాబు ప్రభుత్వ వంద రోజుల ఘనత అని చెప్పారు.
ఇంకా ప్రజల దృష్టి మరల్చడానికే.. ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపులకు దిగారని మాజీ మంత్రి ఆగ్రహించారు. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నది లేనే లేదని.. తన పాలనతో ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్గా మార్చారని ధ్వజమెత్తారు.
వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రూ.20 వేల రైతులకు పెట్టుబడి సాయం, ఫ్రీక్రాప్ ఇన్సూరెన్స్, ఇ– క్రాప్ నమోదు అన్నీ అస్యవ్యస్తంగా తయారయ్యారన్నారు. ఆర్బీకే వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విపత్తుల సహాయ నిధి కనుమరుగైందన్నారు. యంత్రసేవా కార్యక్రమం, అగ్రి టెస్టింగ్ ల్యాబులు అన్నింటినీ అటకెక్కించిన చంద్రబాబు, ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి మంగళం పాడారన్నారు.
సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి అత్యుత్తమ విద్యా విధానాలను రద్దు చేయడం ద్వారా విద్యా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తిరోగమనం పట్టించిందని మాజీ మంత్రి మండిపడ్డారు. తల్లికి వందనం అని చెప్పి పంగనామాలు పెట్టారని ఆక్షేపించారు. గోరుముద్ద ఘోరమైన ముద్దగా మారిందన్నారు. హాస్టళ్లును అత్యంత అధ్వాన్న పరిస్థితుల్లోకి నెట్టారని దుయ్యబట్టారు.
విశాఖ ఉక్కు కోసం పోరాడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చోద్యం చూస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం మరలా బంగారుబాతులా వాడుకునే పనిలో పడిందని ధ్వజమెత్తారు. మొత్తమ్మీద వంద రోజుల కూటమి పాలన ప్రజల ఆశలపై బొంద పెట్టిందని స్పష్టం చేశారు.
మరోవైపు వంద రోజుల పాలనలో నాడు సీఎం శ్రీ వైయస్ జగన్ అనేక సంక్షమ కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకిచ్చిన హమీలు అమలు చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్ట్ల్లో 50 శాతం, రివర్స్ టెండరింగ్, పరిశ్రమల్లో స్ధానికులకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్, లక్షలాది ఉద్యోగాల భర్తీ, సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఘనత జగన్గారికి దక్కిందని గుర్తు చేశారు
అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డంతో పాటు, సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయడం, ఇవ్వని హామీలను కూడా అమలు చేసి, పారదర్శక, ప్రజారంజక పాలన జగన్గారిదని స్పష్టం చేశారు. రైతుభరోసా, సీసీఆర్సీ కార్డులు, పంటల బీమా, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ వంటి అనేక రైతు సంక్షేమ పథకాలు జగన్గారు ప్రవేశపెడితే.. మిగతా రాష్ట్రాలు వాటిని అనుసరించాయని చెప్పారు.
పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అయాలు, డ్వాక్రా యానిమేటర్లు, గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులకు వేతనాలు పెంచడంతో పాటు, ఒకే విడతలో చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 1.27 లక్షల ఉద్యోగాలు నియమించిన ఘనత జగన్గారిదని మాజీ మంత్రి కాకాణి గుర్తు చేశారు.
స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా నాడు–నేడు కార్యక్రమం చేపట్టామన్నారు. ఆరోగ్యశ్రీలో సమూల మార్పులతో పాటు, ఏడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్య ఆరోగ్య రంగాన్ని సమూలంగా మార్చారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి వివరించారు.