
సోమశిల వెనుక జలాలను వెంటనే ఒంటిమిట్ట చెరువులో వదలాలి
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా పుష్కలంగా ఉన్న సోమశిల వెనుక జలాలను ప్రభుత్వ అధికారులు వెంటనే ఒంటిమిట్ట చెరువులోకి వదిలే విధంగా తగు చర్యలు తీసుకొని మండల రైతన్నల కళ్ళలో ఆనందం నింపాలని శనివారం స్థానిక ఏపీ టూరిజం హరిత హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోతిరెడ్డి. భాస్కర్, కార్యనిర్వక అధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కట్ట. యానాదయ అన్నారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ పెన్నా నది నుంచి శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు అందించాలని 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా. చంద్రబాబు నాయుడు అప్పటి రాజంపేట నియోజకవర్గం శాసనసభ్యులు మేడ. మల్లికార్జున్రెడ్డి చొరవతో 40 కోట్ల రూపాయలు విధులు మంజూరు చేసి పైపింగ్ సిస్టం ద్వారా జనరేటర్ సహాయంతో వెనక జలాలని పంపింగ్ చేసి నిల్వ ఉంచడం జరిగింది. ఆ పైపులైన్ల పనులు వేగవంతంగా నాసిరకంగా పూర్తి చేయడంతో నీటి వరవడి తట్టుకోలేక ఎక్కడపడితే అక్కడ మాటిమాటికి పగిలిపోవడంతో మండల రైతన్నలు నిరాశ చెందుతున్నారని ఒంటిమిట్ట చెరువులో సోమశిల వెనుక జలాలను నింపిన పాపాన పోలేదని అన్ని కబుర్లు చెప్పారని ఉన్నతాధికారులపై విమర్శల వర్షం కురిపించారు. ఖర్చు చేసిన 40 కోట్ల రూపాయలు బూడిద పాలు అయిందన్నారు. ఒంటిమిట్ట చెరువులోకి ఎప్పుడు నీళ్లు వస్తాయో ఎదురుచూస్తూనే ఉన్నారని వారన్నారు. 22 గ్రామాల ప్రజలు ఒంటిమిట్ట చెరువులోకి నీళ్లు వస్తాయని గత తొమ్మిది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళలను సాకారం చేయాలన్నారు. కావున స్థానిక ఎమ్మెల్యే , మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చొరవ తీసుకొని పార్టీలకతీతంగా పనిచేసే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి పాడైపోయిన పైపులైను మరమ్మత్తులు చేయించి సోమశిల నీటిని ఒంటిమిట్ట చెరువులో నిలుపుదల చేసి మండల ప్రజల ప్రశంసలు పొంది మండలమంతా పంట పొలాలతో సుభిక్షంగా ఉండేవిధంగా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని లేనిపక్షంలో మండల రైతులందరినీ కూడగట్టుకుని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ముని రెడ్డి ,మనోహర్ రెడ్డి, నగేష్, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.