గుంటూరు నాగార్జున వర్సిటీ : మానవ మేధకు గుర్తింపుగా ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య కె.రామ్ మోహన్ రావు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ విభాగం , ఉన్నత విద్యా మండలి, ఆచార్య నాగార్జున విద్యాలయం ‘రూసా’ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవ కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని అన్నీ రంగాలలో తమ మేధోసంపత్తితో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన భారతీయులు ఎంతవరకు తమ మేధస్సును దేశ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు.

దేశ ప్రజలు అధ్యాపకులు, విద్యార్థులు తమ మేధస్సుతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని నూతన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలలో, విద్యా కేంద్రాలలో, విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులు పరిశోధకులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.విద్యార్థినీ విద్యార్థులు తమలో అంతర్గతం గా ఉన్న మంచి మంచి ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు, నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా నిత్య నూతన మైన సాంకేతిక, శాస్త్రీయ పరిశోధనలు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని అధ్యాపకులకు సూచించారు.ఏప్రిల్ 26 వ తేదీన ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా తమ తమ విద్యా కేంద్రాలలో విద్యార్థులలో సృజనాత్మకత ను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నేటి యువత తమ వినూత్న ఆలోచనలతో స్టార్ట్ అప్ కంపెనీలను ప్రారంభించాలని ప్రభుత్వాలు సైతం అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఆయన సూచించారు.
ఎ ఎన్ యు తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనాత్మక దృష్టితో విద్యాభ్యాసం సాగించాలని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ఎ ఎన్ యు రెక్టార్ ఆచార్య కె రత్న షీలా మణి సభాధ్యక్షులుగా వ్యవహరించారు.

రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం మాట్లాడుతూ నేటి యువత నవీనఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని అందుకు నాగార్జున వర్సిటీ వంటి విద్యా కేంద్రాలు కూడా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ఆచార్య ఎం మురళీమోహన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సుకు కీలక ఉపన్యాసకులుగా నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన డాక్టర్ బీజాయ్ కుమార్ సాహు,ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎమ్ సురేష్ కుమార్,ఆర్ వి ఎస్ ఎస్ ఎన్ రవికుమార్,ఎమ్ అజిత్,ఆచార్య జి చెన్నారెడ్డి, ఆచార్య డివి హర్షవర్ధన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి ప్రిన్సిపాల్ డాక్టర్ డి అనిల్ కుమార్, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలను అందించారు.
Thanks for your feedback!