
ఏ మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
అమరావతి : ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, డాక్టర్ తనూజా రెడ్డి, బాబురావులు మంగళవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ విజయభారతిని కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారని, 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళలను అరెస్టు చేయకుండా ఐదురోజుల పాటు అక్రమంగా నిర్బంధించి వేధించారని, కార్యకర్తలను బెదిరించి వారితో అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతుందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, హోంమంత్రి, డీజీపీలు సక్రమంగా పనిచేయడం లేదని వెల్లడించారు. శాంతియుతంగా ఉన్న వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడితే పరిస్థితి ఎక్కడికెళ్తుందో తెలియదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
ఇప్పటికైనా పీఎం, సీఎం జోక్యం చేసుకుని అరాచకాలకు అడ్డువేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఎంపీలు భరోసా ఇచ్చారు. ఏపీ పరిణామాలపై జోక్యం చేసుకుని మానవ హక్కులను , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.