
యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
సూచించారు. బుధవారం బి.తాండ్రపాడులో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ భవనాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు విద్యతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యాలు ఎంతో అవసరం అన్నారు.. పట్టణ ప్రాంతాల్లోని యువతీ, యువకులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ, యువకులకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు….గ్రామీణ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి కెనరా బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా వివిధ అంశాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు..చాలా మంచి సౌకర్యాలతో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ నిర్వహిస్తున్న కోర్సుల్లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు .గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి, డిగ్రీ పూర్తిచేసిన 18-45సం.ల యువతీ, యువకులకు పలు కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు..పురుషులకు టూ వీలర్ మోటారు సైకిల్ సర్వీసింగ్/రిపేరు, సెల్ ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ ఎలక్ట్రికల్ హెూమ్ వైరింగ్ తదితర కోర్సుల్లో, మహిళలకు టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్యూటీషియన్ తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు.. శిక్షణతో పాటు ఉచిత భోజన,వసతి సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు.. ఈ కోర్సుల్లో చేరి, ప్రస్తుతం ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.. నైపుణ్యానికి తోడుగా ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి డిఆర్డిఎ, మెప్మా, బ్యాంకింగ్ రంగాల్లో చాలా పథకాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని, యువత తమ జీవితాల్లో పురోభివృద్ధి సాధించి, తమ కుటుంబాలకు తోడుగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు..అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి మాట్లాడుతూ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా చాలా సంవత్సరాల నుండి యువతీ, యువకులకు నైపుణ్య పరంగా శిక్షణను ఇచ్చి, వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని, ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
జనరల్ మేనేజర్ ఐ.పాండురంగ మితన్ తాయ మాట్లాడుతూ గ్రామీణ యువతీ, యువకుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1982వ సంవత్సరం నుండి ఈ సంస్థ ద్వారా యువతీ, యువకులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని, నూతనంగా నిర్మించిన ఈ భవనం ద్వారా మరిన్ని నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.అంతకుముందు భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిక్షణ సంస్థలోని వర్క్ షాప్స్, జెంట్స్ డార్మెటరీ, లేడీస్ డార్మెటరీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్ ను ప్రారంభించి, పరిశీలించారు .
శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు యూనిఫామ్, సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుశాంత్ కుమార్, శిక్షణ సంస్థ డైరెక్టర్ పుష్ప కుమార్, ఎల్డిఎం రామచంద్ర రావు, డిఆర్డిఏ పిడి నాగశివలీల, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.