
వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. గుడ్ బుక్ను మేయింటెనెన్స్ చేస్తాం
అమరావతి : ఏపీ మాజీ సీఎం , వైసీపీ నేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్బుక్ ను మేయింటెనెన్స్ చేయడం కష్టమైనా పని కాదని అయితే తాము గుడ్ బుక్ ను పెట్టి మంచి పనులు చేసే వారి పేర్లను వివరాలను నమోదు చేసుకుంటామని వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బుధవారం మంగళగిరి వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత మంచి చేసిన వారి పేర్లను గుర్తు చేసుకుని వారికి అండగా ఉంటూ పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కూటమి నాయకులు కొత్త సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారని రెడ్బుక్ గురించి వ్యాఖ్యనించారు. చంద్రబాబు చేసేవన్ని మోసాలు, అబద్దాలేనని దుయ్యబట్టారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తుంటాయి. కష్టాల నుంచి హీరోలు, నాయకులు పుడుతుంటారని అన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని , కాలర్ ఎగురేసుకునేలా పనులు చేద్దామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. పార్టీ బలమైన నిర్మాణం జరుగాలంటే నియోజకవర్గం, గ్రామ, బూత్ స్థాయి నుంచి బలంగా ఉండాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.