
అప్పులు చేయడంలో చంద్రబాబు దిట్ట : మాజీ మంత్రి బుగ్గన
అమరావతి : అప్పులు చేసి రాష్ట్రాన్ని తిప్పలు పాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు( Chandra Babu) ఎప్పుడూ ముందంజలో ఉంటారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి (Ex-minister Buggana) ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో లక్షా 20 వేల కోట్లు అప్పచేశారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ (Hyderabad) ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమరావతి రాజధాని పేరిట రూ. 31వేల కోట్లు అప్పటు చేశారని, అప్పుల వల్ల రాష్ట్రం ఏమవుతుందో ఆందోళనకరంగా ఉందని అన్నారు. చేసిన అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కేవలంలో 13 శాతం మాత్రమే అప్పులు చేయగా కూటమి ఆరు నెలల కాలంలో 22.6 శాతం అప్పులు చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు.
చేనేత రుణాలు మాఫీ,పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద డబ్బుల హామీ ఎంతవరకు వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విజన్ డాక్యుమెంట్ పేరిట ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అటకెక్కిందని వాపోయారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఊసు ఎత్తడం లేదని విమర్శించారు. దీపం పథకానికి రూ. 3,955 కోట్లు అవసరముండగా బడ్జెట్లో రూ. 895 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు.
ప్రభుత్వ పథకాలు అమలు కాకుంటే నిలదీస్తానని కూటమిలో ఉన్న నేత గతంలో వివరించారని, అదే నేత ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారో తెలుపాలని డిమాండ్ చేశారు. వైసీపీ 12 లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం 7లక్షల22 వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం అప్పులు చేసిందని లెక్కలు చూపించారని తెలిపారు. ఇందులో కూడా గత టీడీపీ చేసిన అప్పులే సగం వరకు ఉన్నాయని ఆరోపించారు.