
ఉద్యాన పంటల సాగు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు: జిల్లాలో మల్లె, జామ, బత్తాయి, మునగ లాంటి ఉద్యాన పంటల సాగు మరింత పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం – హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద చేపట్టిన మల్లె, జామ తోటలను కలెక్టర్ పరిశీలించారు..ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నగరానికి దగ్గర్లో ఉన్న గ్రామాల్లో రైతులతో కనీసం వంద ఎకరాలలో మల్లె సాగు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..అదే విధంగా బత్తాయి, మామిడి, జామ లాంటి పండ్ల తోటలు పెంపకం చేపట్టేలా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద చేపట్టిన మల్లె, జామ తోటల రైతులు పండిస్తున్న శ్రీనివాసులు, సుంకన్న అనే రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో మల్లె తోటను సాగు చేస్తున్నారు ? మల్లె మొక్కలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ? రోజు ఎన్ని కేజీల వరకు మల్లెపూల దిగుబడి వస్తుంది ? కిలో ఎంత ధరకు అమ్ముతున్నారు ? సంవత్సరం ఆదాయం ఎంత వరకు వస్తుంది ? పెట్టుబడి ఎంత మేరకు ఖర్చు అవుతుంది అని కలెక్టర్ రైతు శ్రీనివాసులు ను అడిగి తెలుసుకున్నారు.. ఎకరా భూమిలో మల్లె వేశామని, 1600 మొక్కలు రామేశ్వరం నుండి తెప్పించుకున్నామని, రోజు 70 నుంచి 80 కేజీల వరకు మల్లె పంట వస్తుందని, కేజి రూ.150/- వరకు విక్రయిస్తున్నామని, స్థానిక మార్కెట్ లో విక్రయించడంతో పాటు హైదరాబాద్, బెంగళూరుకు కూడా తరలించడం జరుగుతుందని, 0మల్లె పంట ద్వారా సంవత్సరానికి ఖర్చులు పోగా సుమారుగా 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు శ్రీనివాసులు కలెక్టర్ కు వివరించారు. జామ పంటను పండిస్తున్న సుంకన్న అనే రైతు మాట్లాడుతూ, జామ తోటలో ఎకరాకు సుమారుగా 300 బాక్సులు వరకు పంట దిగుబడి వస్తుందని, బాక్స్ లో 15 కేజీ ల వరకు జామ ఉంటుందని, కాలానుగుణంగా ప్రతి బాక్స్ ను 150 నుండి 300 రూపాయల వరకు విక్రయించడం జరుగుతుందని, వీటి ద్వారా సంవత్సరానికి 60 నుండి 70 వేల వరకు ఆదాయం వస్తుందని కలెక్టర్ కి వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట డ్వామా పిడి వెంకట రమణయ్య, డిపిఓ భాస్కర్, గూడూరు తహశీల్దార్ రామాంజనేయులు,ఎంపిడిఓ శివనాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు