
ముగిసిన రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం
ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు అవగాహన కల్పించిన అధికారులు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు రెండు రోజులపాటు ఉప సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు నిర్వహించిన శిక్షణా తరగతులు శనివారం ముగిసాయి.ఈ శిక్షణా తరగతులలో భాగంగా మండల పరిధిలోని గల అన్ని గ్రామాల ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్ అధికారులు 18,19వ తేదీలలో రెండు రోజులపాటు శిక్షణా తరగతులను నిర్వహించారు.ఈ శిక్షణా తరగతులలో భాగంగా అధికారులు గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న సాధారణ కనీస పరిపాలన విధానంపై, గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ విధానంపై, గ్రామ పంచాయతీలలో త్రాగునీటి సరఫరా విధానంపై,గ్రామ పంచాయతీలోని లేఅవుట్ మరియు బిల్డింగ్ ప్లాన్ల నిబంధనలపై, గ్రామపంచాయతీకు సంబంధించిన ఆస్తులపై, వీధి దీపాలు మరియు విద్యుత్ బిల్లుల నిర్వహణ విధానాలపై, గ్రామపంచాయతీలలో గల ఆర్థిక నిర్వహణ విధానం పై,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపడుతున్న సామాజిక సంక్షేమ పథకాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు వారికి అవగాహన కల్పించారు. మండలంలోని గల ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లు అందరూ పరిపాలన విధానంపై అవగాహన పెంచుకొని గ్రామ పంచాయతీల అభివృద్ధి కు మరియు మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోర్స్ డైరెక్టర్ మరియు ఎంపీడీవో విశ్వ మోహన్ తెలియజేశారు.మండల అభివృద్ధి కొరకు ప్రజాప్రతినిధులందరూ అధికారులకు సహకరించాలని ఎంపీడీవో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప, అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ మరియు ఈఓఆర్డి శ్రీహరి,ఏవో భాష, ప్రోగ్రాం ట్రైనర్లు రామకృష్ణ,శివ,పంచాయతీ కార్యదర్శులు,ఉప సర్పంచులు,వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.