
రహదారులపై ఆక్రమణలు తొలగించాలి
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశాలు
ట్రాఫిక్ నియంత్రణకు దుకాణదారులు సహకరించాలి
న్యూస్ వెలుగు, కర్నూల్: నగరపాలక సంస్థ; నగరంలో రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం రైల్వే స్టేషన్ కూడలి, సంకల్ బాగ్, అశోక్ నగర్, నర్సింగరావు నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ విసృతంగా పర్యటించారు. అలాగే సంకల్ బాగ్ వద్ద పరిశుభ్రత పనులను, పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్న అనధికార దుకాణాలు, ఆక్రమణలను గమనించిన కమిషనర్.. ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే అనధికార దుకాణాలను, రహదారులపై అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వీటిల్లో జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జాప్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని తొలగించాలని ఆదేశించారు. అలాగే వాణిజ్య దుకాణాల వద్ద యజమానులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మురుగు కాలువల్లో దుకాణాల చెత్తాచెదారం వేయోద్దని, నగరపాలక సంస్థకు దుకాణదారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య తనిఖీదారులు మునిస్వామి, షెక్షావలి, తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంబంధాల అధికారి – కర్నూలు నగరపాలక సంస్థ