
రాజకీయ పార్టీల సలహాలను పరిగణలోకి తీసుకుంటాం
* కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యస్.రవీంద్రబాబు
కర్నూలు; న్యూస్ వెలుగు; రాజకీయ పార్టీలు తెలిపే సలహా సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. గురువారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెల మొదటి వారంలో రాజకీయ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చే సలహా సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కాగా సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సమస్యలను లేవనెత్తారు. జోహరపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం లేక, జోహరపురం 257, 258వ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్ళాల్సి వస్తుందని, వారిని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపియం , ఇతర పార్టీల ప్రతినిధులు ఆర్వో దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల జాబితాలో చిరునామా, నగరపాలక ఇంటి నెంబర్లు కొత్తవి గందరగోళంగా ఉందని ప్రతినిధులు ఆర్వో దృష్టికి తెచ్చారు.కార్యక్రమంలో తహశీల్దార్ ఇ.వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ డబ్లూ.ధనుంజయ్, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.