
ఇక ఆన్లైన్లో తిరుమల క్యాలెండర్లు..!
తిరుపతి : భక్తుల సౌకర్యం కోసం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు , డైరీలను ఆఫ్లైన్లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12-పేజీలు, 6-పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
ముఖ్యంగా టీటీడీ ఎంపిక చేసిన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్టుమెంట్ ద్వారా వారి ఇంటి వద్ద పొందే సౌకర్యం కల్పిస్తామని అన్నారు. www.tirumala.org, ttdevasthanams.ap.gov.in ఆన్లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేయాలని సూచించారు.