
విద్యుత్ నియంత్రణ మండలి, భారాల నియంత్రణపై దృష్టి పెట్టాలి
విధానంపై స్పష్టమైన పారదర్శకతతో వ్యవహరించండి
కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యుత్ నియంత్రణ మండలి ఆన్లైన్ అభిప్రాయ సేకరణకు మాత్రమే పరిమితం కాకుండా, పారదర్శకతతో విస్తృత ప్రజాభి ప్రాయాన్ని సేకరించి, భారాల నియంత్రణపై దృష్టి పెట్టాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
శుక్రవారం కర్నూలు, దిన్నదేవరపాడు గ్రామం వద్దగల విద్యుత్ నియంత్రణ భవనం లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న సందర్భంగా కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్ల కార్డులు చేత పట్టుకుని ధర్నా నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయి బాబా అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఎండి ఆనంద్ బాబు, ఎండి అంజిబాబు, జిల్లా కమిటీ సభ్యులు నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, జిల్లా కమిటి సభ్యులు గురుశేఖర్ మాట్లాడారు.
గత ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయలు భారం వేసి బాదిందని, బాదుడే బాదుడంటూ కొత్త రాఘమందుకొని ఎన్నికలకు వెళ్లిన టిడిపి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 77022 కోట్ల రూపాయలు వివిధ రకాల పేరుతో ప్రజలపై భారం వేసిందన్నారు. నేటి భారలకు మేము కారణం కాదంటూ 2014 నుండి 19 వరకు పెట్టిన అప్పును రికవరీ చేస్తున్నామని నిస్సిగ్గుగా పాలకులు చెబుతున్నారన్నారు. పాపం చేశారు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చున్నారని, కార్పొరేట్ల బొజ్జలు నింపేందుకే ప్రభుత్వ విద్యుత్ ఉత్పాదన పై దృష్టి పెంచకుండా, వాటిని నిర్వీర్యం చేస్తూ మరోవైపు భారాలను కొనసాగిస్తున్నారన్నారు. మరో 14 నెలలపాటు ఈ భారాలను వసూలు చేస్తున్నట్లు ఇప్పటికే అర్థమవుతుందన్నారు. కర్నూలు నగరం బుధవారపేట లాంటి ఎస్సీలు నివసించే ప్రాంతంలో మీకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు వస్తుంది ఈ మీటర్లు బిగించుకోండి అంటూ తప్పుడు సమాచారం ఇచ్చి, ఎస్సీలు కానీ వారికి ఈ మీటర్ ద్వారా బిల్లు తగ్గుతుంది అంటూ స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం వస్తున్న ట్రూప్ చార్జీల కారణంగా ఉచిత విద్యుత్తు వస్తున్న వాళ్లకు సైతం అధిక మొత్తంలో బిల్లులు వస్తున్నాయన్నారు. సెకి ఒప్పందం ద్వారా అదానీతో 25 సంవత్సరాల పాటు కొనసాగునున్న సోలార్ విద్యుత్ ఒప్పందం కారణంగా సంవత్సరానికి ₹4350 కోట్లు ప్రజలపై అదనపు భారం వేస్తున్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు, నివాస గృహాలకు, చిన్నా మధ్యతరగతి వ్యాపార సంస్థలకు మీటర్లను బిగించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.
అనంతరం విద్యుత్తు నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ బృందం ఎదుట సిపిఎం అభిప్రాయాన్ని తెలియజేసి, వినతి పత్రాన్ని అందజేశారు.
ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉసేనయ్య, జిల్లా నాయకులు రాఘవేంద్ర, రంగప్ప, ఎన్ జి కృష్ణ, మహమ్మద్ రఫీ, నరసింహ, బిసన్న, మస్తాన్, మధు, నంద్యాల జిల్లా నాయకులు లక్ష్మన్న, బాల వెంకట్, పుల్లా నరసింహ, వెంకట లింగం, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.