
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను జయప్రదం చెయ్యండి
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల, న్యూస్ వెలుగు; మాసోత్సవాలను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి. ప్రతి సంవత్సరం చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఏటా రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించే రవాణా శాఖ ఈసారి మాసోత్సవాలను నిర్వహిస్తోంది.జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్పై చాలా మందికి అవగాహన ఉంది. కానీ నిర్లక్ష్యంతో పాటించడం లేదు. ప్రధానంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది మరణిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే మా ప్రధాన లక్ష్యం : జాగ్రత్తలు
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ , కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మూలమలుపుల వద్ద రోడ్డు దాటకూడదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఓవర్టేక్ చేయొద్దు. అతివేగంగా వాహనం నడిపితే అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ఫోన్ మాట్లాడడం చెయ్యరాదు. రాత్రివేళల్లో విధిగా డిప్పర్ వాడాలి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. యుగంధర్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు జి.శ్రీకాంత్, జి.టి నాయుడు పాల్గొన్నారు.