
విత్తన నాణ్యతను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
రైతులకు అవగాహన కల్పించిన ఆర్.ఎస్.కె అధికారులు మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు
తుగ్గలి, జూన్ 15 ( న్యూస్ వెలుగు ): తుగ్గలి మండలలోని రాతన గ్రామంలో సోమవారం ఆర్.ఎస్.కె అధికారులు వేరుశనగ విత్తనాల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి సురేష్బాబు, పత్తికొండ ఏడీఏ, ఎమ్మిగనూరు ఫారం సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏవో వెంకటేశ్వర్లు రైతులు సాగు కోసం వినియోగిస్తున్న వేరుశనగ విత్తనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాల మొలక శాతం, స్వచ్ఛత, నాణ్యత ప్రమాణాలపై పరిశీలన నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలని, విత్తన శుద్ధి చేపట్టడం ద్వారా పంటను వ్యాధులు, తెగుళ్ల నుంచి రక్షించవచ్చని వివరించారు. అలాగే విత్తనాల కొనుగోలు సమయంలో బిల్లులు, ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా భద్రపరచుకోవాలని సూచించారు. అనంతరం తుగ్గలిలో రైతులతో సమావేశం నిర్వహించి ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన సాగు విధానాలు, పంటల నిర్వహణ, నాణ్యమైన విత్తనాల వినియోగం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇకపై యూరియా ఎరువుల పంపిణీని ఏపీఎంఎస్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రైతులు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకుని, ఆ యాప్ ద్వారా ఎరువులను పొందాలని సూచించారు. రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


