
ఉద్యానవనాల నిర్వహణ మరింత మెరుగుపడాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో ఉద్యానవనాల నిర్వహణ మరింత మెరుగుపరచాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నేతాజీ నగర్లోని ఉద్యానవనాన్ని, రాంబోట్ల దేవాలయం వద్ద బంట్ రహదారిని, అలాగే వీకర్ సెక్షన్ కాలనీలోని నూతనంగా నిర్మించిన మురుగు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆయా కాలనీ వాసులు ఉద్యానవనాలకు వస్తుంటారని, అధికారులు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. పిచ్చిమొక్కల తొలగింపు, చిన్నపాటి మరమ్మత్తులు, నిర్మాణాలు, పచ్చదనం పెంపునకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రాజ్ విహార్, వినాయక ఘాట్, ఐదు రహదారుల కూడలి ప్రాంతాల్లో కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డిఈఈలు క్రిష్ణలత, గిరిరాజు, ఏఈ భాను ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.