
అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ వెలుగు; స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ సహకార సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు, జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, జిల్లా సహకార అధికారి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఐక్యరాజ్యసమితి అధికారికంగా 2025 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం గా (ఐవైసి) సహకార సంస్థ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే నినాదంతో నెలవారి లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. ఈ మేరకు జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఐవైసీ స్టేట్ అపెక్స్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం స్థిరమైన అభివృద్ధిని నడిపించడంలో, గ్లోబల్ సవాళ్ళను పరిష్కరించడంలో సహకార సంఘాలు కీలకమైన పాత్రను పోషిస్తాయన్నారు. జనవరి మాసంలో సహకార విలువలను స్వీకరించే సంవత్సరంగా ప్రారంభిస్తూ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. సహకార క్యాలెండర్ ప్రకారం నెలకు ఒక నినాదంతో అంతర్జాతీయ సహకార ముఖ్య అంశాలు, లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, వాతావరణ చర్యలు, తదితర ఏడు సిద్ధాంతాలతో సత్వరమైన, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పత్తులు, సేవల సమృద్ధిని సాధించడమే సహకార సంఘాల లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఇందుకు పశుసంవర్ధకం, వ్యవసాయం, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, గ్రామీణ అభివృద్ధి, సహకార బ్యాంకులు, జిల్లా పరిషత్, సివిల్ సప్లైస్ తదితర శాఖలు సహకర సంఘాల అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలని సూచించారు.
అనంతరం కోపరేటివ్ సొసైటీ బ్యాంకు ద్వారా ఐదు మంది రైతులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున పంట రుణాలు చెక్కులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు