
క్రీడల అభివృద్ధికి సహకరించాలి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు శాప్ ఛైర్మన్ వినతి
కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ అభివృద్ధిలో ప్రధానభూమిక పోషించిన విధంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్రీడల అభివృద్ధికి సహకరించాలని ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కోరారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు విచ్చేసిన శాప్ ఛైర్మన్ రవినాయుడు మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్ను కర్నూలులోని వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ ఏపీలోని క్రీడలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తొలుత కర్నూలు జిల్లాలో చేపట్టాల్సిన క్రీడల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు టీజీ వెంకటేష్కు వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఏదొక క్రీడను దత్తత తీసుకుని ఆ క్రీడలో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా క్రీడల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమకూర్చేందుకు సహకరించాలని, గతంలో మీ హయాంలో సొంత నిధులను వెచ్చించి క్రీడాపోటీలు నిర్వహించిన విధంగానే ప్రస్తుత పరిస్థితుల్లోని క్రీడల అభివృద్ధికి సాయపడాలని విన్నవించారు. గతంలో మీరు క్రీడాకారులను ప్రోత్సహించేవ్యక్తిగా ముందంజలో ఉన్నవ్యక్తిని, క్రీడల ప్రోత్సహానికి మీలాంటి వారి అవసరం ఉందని ఆకాంక్షించారు. మీరు ముందుకొస్తే క్రీడలకు పూర్వవైభవం చేకూరుతుందని రవినాయుడు కోరారు. దీనిపై వెంకటేష్ గారు సానుకూలంగా స్పందించి క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి నావంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.