
చల్లంగా చూడయ్యా….
చల్లంగా చూడయ్యా….
నేడు శ్రీ సిద్దేశ్వర స్వామి మహా రథోత్సవం.
హాజరు కానున్న అశేష భక్త జనం
పటిష్టంగా పోలీస్ బందోబస్తు.
హోళగుంద,న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో స్వయంభువుగా వెలసిన మండల ప్రజల ఆరాధ్యదైవం శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం నేడు
అశేష భక్త జనుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ తెలిపారు.రథోత్సవంలో భాగంగా స్వామి వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఇలా…
మండల కేంద్రంలో స్వయంభుగా కొలువైన మరియు నిత్యం ప్రజలచే విశేష పూజలు అందుకుంటున్న శ్రీ సిద్దేశ్వర స్వామి మహా రథోత్సవం వెనుక 400 సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది.ఈ రథోత్సవం నిర్వహణను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా పంపన్న గౌడ కుటుంబ సభ్యులు గత కొన్ని వందలాది సంవత్సరాలుగా తమ సొంత ఖర్చులతో ఉత్సవాలను ఘనంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరుపుతారు.పూర్వకాలం నుంచి ఆలయ ధర్మకర్త వంశికులైన కొట్రెగౌడకు కలలో శ్రీ సిద్దేశ్వర స్వామి కనిపించి తాను కొండ గుహలో స్వయంభువుగా వెలిసి ఉన్నానని తనకు ఆలయం నిర్మించి పూజలు జరపాలని చెప్పగా మరుసటి రోజు ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రదేశానికి వెళ్లి వెతకగా అక్కడ గుహ ప్రాంతంలో స్వయంభువుగా వెలిసిన ఈశ్వరలింగం కనిపించడంతో ఆశ్చర్యలతో పరవశించి ఆలయం నిర్మించారు.అప్పటి నుండి పూజలు నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి.కొట్రే గౌడ ఆలయాన్ని నిర్మించగా ఆయన కుమారుడు అమర గౌడ్ ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ ఆలయ గోపురాన్ని 165 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టి రథోత్సవాన్ని తయారు చేయించి మాఘ శుద్ధ దశమి రోహిణి నక్షత్రం నాడు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది.అంతేకాకుండా నాటి బ్రిటిష్ గవర్నమెంట్ నందు కూడా వీరి కుటుంబీకులు ఎన్నో సేవలు అందిస్తూ ఉండడంతో అప్పటి బ్రిటీష్ యువరాణి వీరికి “రాజా” అనే బిరుదును కూడా బహుకరించినట్లు చరిత్ర చెబుతోంది.మరియు రథోత్సవ వేడుకలకు గ్రామాల్లోని భక్తులతో పాటు ఇతర గ్రామాల్లోనీ ప్రజలు,ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి రథోత్సవంతో పాటు లంక దహన కార్యక్రమానికి హాజరై స్వామి వారిని దర్శించుకోవటం ఇక్కడి విశేషం.
జాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం.
నేడు జరిగే శ్రీ సిద్దేశ్వర స్వామి జాత్ర మహోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం, త్రాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ధర్మకర్త రాజపంపన్న గౌడ్ తెలిపారు.
ఉత్సవాల్లో అలరించనున్న సంస్కృతి కార్యక్రమాలు.
శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని 8న శ్రీ సిద్దేశ్వర స్వామి కృపాపోషిత నాటక మండలి మరియు కన్నడ సంఘం ఆధ్వర్యంలో కుడుక కట్టిద తాళి సామాజిక నాటకం,7న వీర అభిమన్యు కాళగ అనే బయలు నాటకాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జాతర ఉత్సవాల్లో భారీ బందోబస్తు.
నేడు శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు ఎస్ఐ బాల నరసింహులు తెలిపారు.